
హనుమకొండ, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి 15 రోజులకొకసారి ఆర్అండ్ బీ, పోలీస్, ఎన్ హెచ్, జీడబ్ల్యూఎంసీ అధికారులు జాయింట్ ఇన్ స్పెక్షన్స్ చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో రోడ్డు భద్రతపై వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రోడ్లపై రద్దీ ప్రాంతాలు, ప్రమాదకర ప్రాంతాలు, క్రిటికల్ జంక్షన్లను గుర్తించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కటాక్షపూర్ వద్ద హైవేపై ప్రమాదాల నివారణకు రేడియం సైన్ బోర్డులు, బ్లింకర్లు ఏర్పాటు చేయాలన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి జాబితాను అందజేయాలన్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలతోపాటు మ్యాన్ హోల్స్ వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.